రథసప్తమి వేడుకలు – బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి.
జోనల్ ఇంచార్జి పి. మహేశ్వరరావు.
అనకాపల్లి రూరల్, జనవరి 23 అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజుపాలెం గ్రామంలో వేంచేసియున్న శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఈ నెల 25న జరగనున్న రథసప్తమి వేడుకల భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా,స్వయంగా పరిశీలించారు.ముందుగా జిల్లా ఎస్పీ ఆలయాన్ని సందర్శించి, శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో బందోబస్తు ఏర్పాట్లపై పోలీస్ అధికారులు మరియు ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఉత్సవాల సందర్భంగా భద్రతను పటిష్టం చేసేందుకు ఆలయ పరిసరాల్లో అత్యాధునిక సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, రద్దీని పర్యవేక్షించేందుకు డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు.
భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ పరిసర ప్రాంతాల్లో, పార్కింగ్ స్థలాల్లో మరియు క్యూలైన్లలో సరిపడా విద్యుత్ దీపాల ఏర్పాటు చేయాలని సూచించారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, వేలాదిగా తరలివచ్చే భక్తులకు ప్రశాంత వాతావరణంలో దర్శనం జరిగేలా చూడాలని స్పష్టం చేశారు.
భారీ వాహనాల మళ్లింపు, భక్తుల వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాల ఏర్పాటుపై పటిష్ట ప్రణాళిక అమలు చేయాలని ఆదేశించారు.
ఎక్కడా ఎటువంటి అపశ్రుతులు చోటు చేసుకోకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, క్యూలైన్ల వద్ద వాలంటీర్లు మరియు పోలీసులు సమన్వయంతో వ్యవహరించాలని పేర్కొన్నారు.
ఈ సమీక్షా కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు:
ఎం.శ్రావణి (సబ్ డివిజన్ డీఎస్పీ)
ఇన్స్పెక్టర్లు: అశోక్ కుమార్, వెంకట నారాయణ, ప్రేమ్ కుమార్, స్వామి నాయుడు.
ఎస్సై: రవికుమార్, ఆలయ కమిటీ సభ్యులు మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
భక్తుల భద్రతే ధ్యేయంగా ప్రతి ఒక్క అధికారి అంకితభావంతో పనిచేసి, రథసప్తమి వేడుకలను విజయవంతం చేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు.
