గంజాయి అక్రమ రవాణాదారులపై ఉక్కుపాదం.

గంజాయి అక్రమ రవాణాదారులపై ఉక్కుపాదం.

అనకాపల్లి జిల్లాలో ఇద్దరిపై PIT NDPS చట్టం ప్రయోగం.

ఎస్పీ  తుహిన్ సిన్హా  ఆదేశాల మేరకు నిందితులు విశాఖ సెంట్రల్ జైలుకు తరలింపు.

​ అనకాపల్లి (వి.మాడుగుల/చీడికాడ), జనవరి 12: జిల్లాలో గంజాయి అక్రమ రవాణాను సంపూర్ణంగా నిర్మూలించాలన్న జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. పదేపదే గంజాయి నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు పాత నేరస్థులపై అత్యంత కఠినమైన PIT NDPS ACT (Prevention of Illicit Traffic in Narcotic Drugs and Psychotropic Substances Act) కింద ఉత్తర్వులు జారీ అయ్యాయి.

​అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ  ఎం.శ్రావణి  పర్యవేక్షణలో, వి.మాడుగుల మరియు చీడికాడ పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

​నిందితుల వివరాలు మరియు నేర చరిత్ర:

 ఈ కేసులో నిందితుడైన పిచ్చేటి రాజు (40), తండ్రి లేట్ చిన్నం నాయుడు (అలియాస్ మహాలక్ష్మి నాయుడు), అనకాపల్లి జిల్లా వి.మాడుగుల మండలం, జంపేన గ్రామానికి చెందిన వ్యక్తి. వృత్తిరీత్యా ఆటో డ్రైవర్ అయిన ఇతను గత కొంతకాలంగా గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడు. ఇతనిపై గతంలో వి.మాడుగుల పోలీస్ స్టేషన్‌లో 2016 మరియు 2019 సంవత్సరాల్లో రెండు కేసులు, అలాగే 2024లో రావికమతం పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు కలిపి మొత్తం మూడు గంజాయి అక్రమ రవాణా కేసులు నమోదై ఉన్నాయి. మరో నిందితుడు గాడి అప్పారావు (55), తండ్రి లేట్ మర్రి బాబు (అలియాస్ మరిడయ్య), అనకాపల్లి జిల్లా, చీడికాడ మండలం, బైలపూడి గ్రామానికి చెందినవాడు. ఇతను కూడా గత పదేళ్లుగా వరుస నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఇతనిపై 2015లో అనకాపల్లి టౌన్, 2019లో కశింకోట, 2022లో చీడికాడ మరియు 2023లో ఏ.కోడూరు పోలీస్ స్టేషన్లలో కలిపి మొత్తం నాలుగు గంజాయి కేసులు నమోదయ్యాయి. ఈ ఇద్దరు నిందితులు పదేపదే నేరాలకు పాల్పడుతూ సమాజ శాంతికి భంగం కలిగిస్తుండటంతో, వీరిపై PIT NDPS చట్టం ప్రయోగించి ఏడాది పాటు నిర్బంధానికి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.నిందితులు నిరంతరం అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ, సమాజానికి హానికరంగా మారడంతో ఎస్పీ సిఫార్సు మేరకు ప్రభుత్వం వీరిని ఏడాది పాటు నిర్బంధించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

అరెస్ట్ వివరాలు: కె.కోటపాడు సిఐ పైడపు నాయుడు, వి.మాడుగుల ఎస్సై జి.నారాయణ రావు మరియు చీడికాడ ఎస్సై బి.సతీష్ తమ సిబ్బందితో కలిసి నిందితులను అరెస్ట్ చేశారు.

ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు నిందితులను విశాఖపట్నం సెంట్రల్ జైలుకు రిమాండ్ నిమిత్తం తరలించారు.

​ పోలీసుల హెచ్చరిక:

జిల్లాలో గంజాయి వ్యాపారం చేసినా లేదా రవాణాకు సహకరించినా ఉపేక్షించేది లేదు. ప్రతి ఒక్కరిపై నిఘా ఉంది. పునరావృత నేరాలకు పాల్పడే వారిపై PIT NDPS వంటి కఠిన చట్టాలను ప్రయోగించి, జైలుకు పంపడం జరుగింది.


 

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post