పలాస అభివృద్ధి, గిరిజన విద్యార్థుల సమస్యలపై విద్యాశాఖ డైరెక్టర్కు ఎమ్మెల్యే వినతి.
క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రత్యేక ప్రతినిధి శంకర్ తమ్మినాన.
పలాస: పలాస నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ థమీమ్ అన్సారియా, ఐఏఎస్ దృష్టికి పలాస ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష తీసుకెళ్లారు. మంగళగిరిలోని విద్యా భవన్లో గురువారం డైరెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి వివిధ అభివృద్ధి, విద్యా సంబంధిత అంశాలపై వినతిపత్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా పలాస మున్సిపాలిటీ పరిధిలో యువతకు మెరుగైన క్రీడా వసతులు కల్పించేందుకు మినీ స్టేడియం నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు. క్రీడలను ప్రోత్సహించడంతో పాటు స్థానిక యువత ప్రతిభను వెలికితీసేందుకు ఈ స్టేడియం ఉపయోగపడుతుందని వివరించారు.
అదేవిధంగా, బుడార్సింగిలో పీఎం జన్మన్ హాస్టల్ ప్రారంభమైనప్పటికీ, అక్కడ నివసిస్తున్న 81 మంది గిరిజన విద్యార్థులు ప్రతిరోజూ సుమారు 8 కిలోమీటర్లు నడిచి పాఠశాలకు వెళ్లాల్సి వస్తోందని డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని హాస్టల్ ప్రాంగణంలోనే పాఠశాల ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ వినతులపై స్పందించిన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ థమీమ్ అన్సారియా, ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలించి, నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యేకు హామీ ఇచ్చినట్లు సమాచారం.
