గ్రీవెన్స్లో ప్రజల అర్జీలు స్వీకరించిన ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు.
క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రత్యేక ప్రతినిధి శంకర్ తమ్మినాన.
అమరావతి, జులై 7:
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఏపీటీపీసీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి వజ్జ బాబూరావు పేర్కొన్నారు. అమరావతిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆయన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డితో కలిసి పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.
రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వచ్చిన ప్రజలు భూ సమస్యలు, రెవెన్యూ వ్యవహారాలు, సంక్షేమ పథకాల అమలు, రవాణా, స్థానిక సంస్థలు, సామాజిక సంక్షేమం తదితర అంశాలపై తమ ఫిర్యాదులు, వినతులను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించిన నాయకులు, సంబంధిత శాఖల అధికారులతో నేరుగా మాట్లాడి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ సందర్భంగా వజ్జ బాబూరావు మాట్లాడుతూ, ప్రజల ఇబ్బందులకు వేగంగా స్పందించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారి సమస్యలకు తక్షణ పరిష్కారం చూపే విధంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజలకు అందుబాటులో ఉండే పరిపాలనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.
గ్రీవెన్స్ కార్యక్రమం ద్వారా వచ్చిన ప్రతి వినతిని సంబంధిత శాఖలకు పంపించి నిర్ణీత సమయంలో పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం పనిచేస్తోందని అన్నారు.
మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల నుంచి అందిన ప్రతి అర్జీపై శాఖల అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా సమన్వయంతో పనిచేసి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారాన్ని పాలనలో ప్రధాన లక్ష్యంగా తీసుకుని ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ప్రజలకు చేరువయ్యే పరిపాలన అందించడంలో ఇటువంటి గ్రీవెన్స్ కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని నాయకులు పేర్కొన్నారు.

