ధాబాలలో మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు: అచ్యుతాపురం పోలీసులు.
క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.
అనకాపల్లి ఆగస్టు :08
అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఆదేశాల మేరకు, శనివారం అచ్యుతాపురం మండల పరిధిలోని ధాబా యజమానులతో సర్కిల్ ఇన్స్పెక్టర్ (సిఐ) ఆర్.చంద్రశేఖర్ రావు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్సైలు సుధాకర్, పోషణ గౌరీలతో పాటు మండల పరిధిలోని 7 ధాబాల యజమానులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సిఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ,ధాబాలలో అక్రమంగా మద్యం విక్రయించినా లేదా మద్యం సేవించడానికి అనుమతించినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ధాబాల వద్ద అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా యజమానులే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
ధాబాలలో ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం అమ్మకాలు జరపరాదు, మద్యం సేవించేందుకు వినియోగదారులను అనుమతించకూడదు.
ధాబాల ముందు రోడ్లపై లారీలు, ఇతర వాహనాలను అస్తవ్యస్తంగా నిలపడం వల్ల తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో పాటు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కావున వాహనాలను నిర్దేశిత పార్కింగ్ స్థలాల్లోనే నిలిపేలా యజమానులు చర్యలు తీసుకోవాలి. ధాబాల వద్ద ఎలాంటి గొడవలు జరగకుండా చూడాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సంబంధిత యజమానులపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
భద్రతా కారణాల దృష్ట్యా ప్రతి ధాబా వద్ద తప్పనిసరిగా సిసి టివి (CCTV) కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ప్రజల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా ఈ తనిఖీలు, సమావేశాలు నిర్వహిస్తున్నామని, నిబంధనలు అతిక్రమిస్తే ధాబాలను సీజ్ చేయడానికి కూడా వెనుకాడమని పోలీసులు స్పష్టం చేశారు.
