అంగన్వాడీలకు జ్ఞానజ్యోతి శిక్షణ ప్రారంభం.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా కంభంస్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ కార్యకర్తలకు నిర్వహిస్తున్న మూడు రోజుల జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందుతున్న సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు, కార్యకర్తలలో నైపుణ్యాలను పెంపొందించడమే ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.
ఈ శిక్షణ కార్యక్రమానికి కోర్సు డైరెక్టర్గా అబ్దుల్ సత్తార్,వీరనారాయణ వ్యవహరించగా, కెఆర్పీలుగా మరియ దాస్, గోపిశెట్టి.శ్రీనివాసులు, వేణుగోపాలాచారి, రాజేష్ పాల్గొని అంగన్వాడీ కార్యకర్తలకు వివిధ అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు.
శిక్షణలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, చిన్నారుల అభివృద్ధి, ప్రీ-స్కూల్ విద్య, పిల్లలలో అభ్యసన సామర్థ్యాల పెంపుదల, పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణ తదితర అంశాలపై వివరించారు.
సీడీపీఓ కుమారి, సూపర్వైజర్ గాలమ్మ అంగన్వాడీ కార్యకర్తలకు అవసరమైన సలహాలు, సూచనలు అందించారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులతో ప్రేమపూర్వకంగా వ్యవహరిస్తూ, వారికి ఆటలు, పాటలు, కథలు తదితర కార్యకలాపాల ద్వారా విద్యను అందించాలని సూచించారు. చిన్నారుల శారీరక, మానసిక, సామాజిక అభివృద్ధిని నిరంతరం పర్యవేక్షిస్తూ, తల్లిదండ్రులతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు.
కంభం మండల పరిధిలోని మొత్తం 51 అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు ఈ మూడు రోజుల జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమంలో పాల్గొని,శిక్షణ ద్వారా తమ విధులు, బాధ్యతలపై మరింత అవగాహన పెంచుకుంటారని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యమైన, నైపుణ్యమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని కార్యకర్తలు తెలిపారు.
మూడు రోజుల పాటు జరిగే ఈ శిక్షణలో నిపుణుల మార్గదర్శకత్వంలో వివిధ అంశాలపై ప్రాక్టికల్ అవగాహన కల్పించడంతో పాటు, అంగన్వాడీ కేంద్రాల్లో ఎదురయ్యే సమస్యలను చర్చించి వాటి పరిష్కార మార్గాలను కూడా వివరించనున్నారు.

