వెలుగొండ ప్రాజెక్ట్ పునరావాస కాలనీల్లో మౌలిక వసతుల కల్పన త్వరితగతిన పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ముమ్మరంగా అప్రోచ్ రోడ్లు, తాగునీరు, విద్యుద్దీకరణ పనులు చేపట్టాలి.
జాయింట్ కలెక్టర్, అధికారులతో కలిసి వేములకోట, దేవరాజుగట్టు తదితర కాలనీల్లో విస్తృత తనిఖీలు.
మార్కాపురం, వెలుగొండ ప్రాజెక్ట్ పునరావాస కాలనీల్లో ముంపు నిర్వాసితులకు అవసరమైన అన్ని రకాల మౌలిక వసతుల కల్పనను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా త్వరితగతిన పూర్తి చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అధికారులను ఆదేశించారు.
శనివారం రోజున మార్కాపురం, పెద్దారవీడు మండలాల పరిధిలోని వెలుగొండ ప్రాజెక్ట్ పునరావాస కాలనీలైన దేవరాజుగట్టు, వేములకోట, తోకపల్లి, ఇడుపూర్ - 1, 2 లలో ఏర్పాటు చేస్తున్న మౌలిక వసతుల పురోగతిని జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి మరియు వెలుగొండ ప్రాజెక్టు అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో విస్తృతంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా కాలనీల లేఅవుట్లను, పనుల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించిన పిదప జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...
ప్రాధాన్యత ప్రాతిపదికన పనులు: పునరావాస కాలనీలకు వెళ్లే అప్రోచ్ రోడ్లు, తాగునీటి సరఫరా మరియు విద్యుత్ సౌకర్యాల ఏర్పాట్లను సత్వరమే పూర్తి చేసేందుకు ప్రత్యేక చొరవ చూపాలని స్పష్టం చేశారు.
జంగిల్ క్లియరెన్స్, లెవెలింగ్: ఇంకా జంగిల్ క్లియరెన్స్ పూర్తికాని కాలనీలలో తక్షణమే పొదలను తొలగించి, భూమిని సమాంతరంగా (లెవెలింగ్) మార్చే పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
నాణ్యతా ప్రమాణాలు: నిర్వాసితులకు కల్పిస్తున్న మౌలిక వసతులలో ఎలాంటి లోపాలు ఉండకూడదని, పనుల నాణ్యతలో రాజీ పడకుండా నిర్దేశిత సమయానికి అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు.
ఈ తనిఖీలో వెలుగొండ ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు, స్థానిక రెవెన్యూ సిబ్బంది మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
