శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: రౌడీ షీటర్లకు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా,హెచ్చరిక.
క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.
అనకాపల్లి, జూన్ :06
జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా రౌడీ షీటర్ల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా,పోలీసు అధికారులను ఆదేశించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల ఉక్కుపాదం మోపుతామని ఆయన స్పష్టం చేశారు.
ఎవరైనా రౌడీ షీటర్లు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసినా, శాంతిభద్రతల సమస్యలు సృష్టించినా వారిపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పదే పదే నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ (PD Act) నమోదు చేయడమే కాకుండా, అవసరమైతే జిల్లా నుండి బహిష్కరణ (Externment) ఉత్తర్వులు జారీ చేస్తామని హెచ్చరించారు.
ఎస్.హెచ్.ఓ ల బాధ్యత - నిరంతర పర్యవేక్షణ
స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్ల ప్రస్తుత జీవన స్థితిగతులను ఎస్.హెచ్.ఓలు నిశితంగా పరిశీలించాలి.
వారు ప్రస్తుతం జీవనోపాధి కోసం ఏం పని చేస్తున్నారు?
నేర ప్రవృత్తిని వీడి సాధారణ జీవితం గడుపుతున్నారా లేదా? అన్న అంశాలను నివేదించాలి.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎదురయ్యే తీవ్ర పరిణామాల గురించి వారిని వ్యక్తిగతంగా హెచ్చరించాలి.
కౌన్సిలింగ్ మరియు సామాజిక బాధ్యత
ప్రతి వారం రౌడీ షీటర్లను స్థానిక పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించాలి. వారి కుటుంబ సభ్యులు మరియు గ్రామ పెద్దల సమక్షంలో సత్ప్రవర్తనపై హామీ పొందాలి. ఎటువంటి గొడవలకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడబోమని వారి నుండి రాతపూర్వక అంగీకారం తీసుకోవాలి.
రౌడీ షీట్ల తొలగింపు - సత్ప్రవర్తనకు అవకాశం
నేర ప్రవృత్తిని పూర్తిగా విడిచిపెట్టి, గత కొంతకాలంగా ఎటువంటి కేసుల్లోనూ నిందితులుగా లేకుండా, సమాజంలో గౌరవప్రదంగా జీవిస్తున్న వారిపై సానుకూల నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అటువంటి వారిపై ఉన్న రౌడీ షీట్లను ఎత్తివేసేందుకు అవసరమైన చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఎస్పీ సూచించారు.
జిల్లాలో అరాచక శక్తులకు తావులేదని, సామాన్య ప్రజల రక్షణే తమ ప్రాధాన్యతని ఎస్పీ తెలిపారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు.
