పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలి -సిపిఐ ఏలూరు జిల్లా సమితి కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య .
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శరత్.
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని పవర్ పేట రైల్వే స్టేషన్ నుండి ఆర్.ఆర్.పేట పార్కు వరకు ర్యాలీ నిర్వహించి కరపత్రాలను పంపిణీ చేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ ఏలూరు జిల్లా సమితి కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 2014 ఎన్నికల సమయంలో అప్పటి యూపీఏ 2 ప్రభుత్వం ధరలను పెంచేసిందని, చుక్కల్లో ఉన్న ధరలను తగ్గిస్తామని హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజలపై నిరంతరం ధరల భారాన్ని మోపుతుందని ఆరోపించారు. పశ్చిమాసియా దేశాల యుద్ధం నేపథ్యంలో 10 రోజుల్లో నాలుగు సార్లు పెట్రోల్ డీజిల్ ధరలను బిజెపి ప్రభుత్వం పెంచడం వలన సామాన్య ప్రజలు కొని తినలేని పరిస్థితులలో ఉన్నారని విమర్శించారు. కమర్షియల్ గ్యాస్ ధరలు పెరగడం వలన సామాన్య జనం ఇడ్లీ తినాలన్న 60 రూపాయలు చెల్లించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు బిజెపి ప్రభుత్వం పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గించలేదు కానీ క్రూడాయిల్ ధర ఏ కాస్త పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచేస్తున్నారని ఆరోపించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు అవ్వగానే బిజెపి ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను రికార్డు స్థాయిలో పెంచేసిందని ఆరోపించారు. బిజెపి పాలనలో సామాన్య ప్రజలు,కార్మికులు,కర్షకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను బిజెపి ప్రభుత్వం తక్షణం విడనాడి ప్రజా రంజక పాలన అందించాలని డిమాండ్ చేశారు. సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్ మాట్లాడుతూ పశ్చిమాసియా దేశాల యుద్ధం ప్రారంభం అవ్వగానే భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)ఇతర వామపక్షాలు,మేధావులు దేశంలో ఆయిల్ సంక్షోభం వస్తుందని బిజెపి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ హెచ్చరికలను పరిగణలోకి తీసుకొనకుండా మొండి మోడీ విధానాల వలన దేశంలో పెట్రోల్ ఆయిల్ గ్యాస్ సంక్షోభం ఏర్పడిందని ఆరోపించారు. యుద్ధం ప్రారంభమైన వారం రోజులకే దేశంలో విపరీతమైన పెట్రోల్,డీజిల్ గ్యాస్ సంక్షోభం ఏర్పడిందని దాన్ని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఆయిల్ రిఫైనరీ కంపెనీలు విచ్చలవిడిగా ప్రజల నుండి దోచుకోవడానికి బిజెపి ప్రభుత్వం సహకరించిందని ఆరోపించారు. గత పది రోజుల్లో నాలుగు సార్లు పెట్రోల్,డీజిల్, గ్యాస్ ధరలు పెరిగినప్పటికీ కేంద్రం చర్యలు తీసుకోకపోవడం ఈ విషయాన్ని మరింత బలపరుస్తుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం పెట్రోల్,డీజిల్ ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ రాష్ట్రం విధించే సెస్ మాత్రం తగ్గించకుండా కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రజలను దోచుకుంటుందని ఆరోపించారు. తక్షణమే పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించి ప్రజలపై భారాలను నివారించాలని రాష్ట్రవ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఈనెల 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు వివిధ రూపాలలో ప్రచార ఆందోళనలను నిర్వహించి ఈనెల 9వ తేదీన రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రజలందరూ అధిక ధరల వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ జిల్లా కోశాధికారి పుప్పాల కన్నబాబు మాట్లాడుతూ బిజెపి కేంద్రంలో అధికారం చేపట్టిన నాటి నుండి దేశంలోని బడుగు బలహీన వర్గాల పైన సామాన్య ప్రజల పైన విపరీతమైన ధరల భారాలను వేస్తుందని ఆరోపించారు. అధిక ధరలు తగ్గిస్తామని అధికారంలోకి వచ్చిన బిజెపి ధరలు తగ్గించకపోగా ప్రజలపై మరిన్ని భారాలు వేస్తూ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను సైతం విపరీతంగా పెంచేసిందని విమర్శించారు. ఈ విధానాలను నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈనెల 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు జరిగే ఆందోళన కార్యక్రమాలలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఏరియా సమితి సహాయ కార్యదర్శి కురెళ్ళ వరప్రసాద్ కార్యవర్గ సభ్యులు గొర్లి స్వాతి,శాయన అభిలాష్ కుమార్, కొండేటి రాంబాబు, దాసిపల్లి ఎర్రయ్య,జిల్లా కౌన్సిల్ సభ్యులు భజంత్రీ శ్రీనివాసరావు, ఉప్పులూరి లక్ష్మి,కంటపరెడ్డి భాస్కరరావు,నడిపూడి ప్రసాద్,డి ఈశ్వరరావు,జి దుర్గారావు,ఎస్ బాబుజి, పి నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
