కలింగదళ రిజర్వాయర్ ఆయకట్టు కాలువల అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే గౌతు శిరీష.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.
మందస, జూన్ 23: పలాస నియోజకవర్గం మందస మండల పరిధిలోని కలింగదళ రిజర్వాయర్ ఆయకట్టు భూములకు సాగునీరు అందించే ప్రధాన కాలువల అభివృద్ధి పనులను పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష మంగళవారం పరిశీలించారు.
గత 15 సంవత్సరాలుగా ఆయకట్టు కాలువలకు పూడికతీత పనులు చేపట్టకపోవడం, మధుముల షట్టర్లు మరమ్మతులకు నోచుకోకపోవడంతో రైతులు సాగునీటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను గుర్తించిన ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రత్యేక చొరవ తీసుకుని కాలువల అభివృద్ధి, పూడికతీత, షట్టర్ల మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేయించారు.
పనులు సకాలంలో పూర్తి చేసి రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, నాణ్యతతో పనులు పూర్తి చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతాంగ సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, వ్యవసాయానికి అవసరమైన సాగునీటి వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కాలువల ఆధునీకరణతో ఆయకట్టు రైతులకు మెరుగైన సాగునీటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మందస మండల అధ్యక్షుడు భావన దుర్యోధన, లబ్బ రుద్రయ్య, తమరియా భాస్కర్, రట్టి లింగరాజు, ముంజేటి చంద్రశేఖర్, బేసి ఈశ్వరరావు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

