ఏలూరులో బాల కార్మిక నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు.
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై ముద్రించిన పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.
ఏలూరు, జూన్, 12 : బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా స్థానిక కలెక్టరేట్ లో శుక్రవారం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై ముద్రించిన పోస్టర్ను జిల్లా కలెక్టర్ . వెట్రిసెల్వి . ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ సమాజానికి ఒక శాపమని, దీనిని పూర్తిగా నిర్మూలించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని, జిల్లాలో బాలకార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. బాల కార్మిక నిర్మూలన కోసం జిల్లా టాస్క్ ఫోర్స్ (DTF) కమిటీకి చెందిన అన్ని శాఖలు, స్వచ్ఛంద సంస్థలు మరియు భాగస్వామ్య సంస్థలు సమన్వయంతో పనిచేయాలన్నారు. బాల కార్మిక నిషేధ చట్టాలపై అవగాహన కల్పిస్తూ, ఎక్కడైనా బాల కార్మికులు పనిచేస్తున్నట్లు గుర్తించినట్లయితే వెంటనే చైల్డ్ హెల్ప్లైన్ టోల్ ఫ్రీ నంబర్ 1098కు సమాచారం అందించేలా ప్రజలలో అవగాహన కలిగించాలన్నారు. ప్రజల సహకారంతోనే బాల కార్మిక రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప కార్మిక కమిషనర్, ఏలూరు పి. శ్రీనివాస్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) చైర్మన్ నాగేశ్వరరావు, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ శారద, సహాయ కార్మిక కమిషనర్ జి. నాగేశ్వరరావు, జిల్లా బాలల సంరక్షణ అధికారి సూర్య చక్రవేణి, సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ పంకజ్ కుమార్, , ఏఎల్ఎస్ కోఆర్డినేటర్ నాగేశ్వరరావు, క్రాఫ్ (CRAF) స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
