నూతన పోలీస్ స్టేషన్ భవనాల ప్రారంభం – ప్రజా భద్రతే ధ్యేయంగా ఆధునిక పోలీసింగ్.
క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.
అనకాపల్లి:నర్సీపట్నం:ఏప్రిల్14
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలోని నాతవరం, కృష్ణదేవిపేట మరియు గొలుగొండ మండలాల్లో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మరియు హోంమంత్రి వంగలపూడి అనిత ఘనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ప్రభుత్వం SIS (Special Infrastructure Scheme) కింద ఒక్కో పోలీస్ స్టేషన్కు రూ.2.5 కోట్ల చొప్పున నిధులు కేటాయించారు.
ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ భవనాలు నిర్మించబడ్డాయి.
ఈ నూతన భవనాల్లో సిసిటివి కెమెరాలు, ఆధునిక కౌన్సిలింగ్ గదులు, మహిళా పోలీసులకు ప్రత్యేక విశ్రాంతి గదులు మరియు బందోబస్తు విధుల కోసం వచ్చే సిబ్బందికి అవసరమైన అన్ని వసతులు కల్పించారు.
*ముఖ్య అతిథుల ప్రసంగాలు:*
*చింతకాయల అయ్యన్నపాత్రుడు ( స్పీకర్):*
ప్రభుత్వం ప్రజల భద్రతకు పెద్దపీట వేస్తూ పోలీస్ వ్యవస్థను ఆధునీకరిస్తోందని తెలిపారు. జిల్లా పోలీసులు గత రెండు సంవత్సరాలుగా ఎస్పీ గారి నేతృత్వంలో బాగా పని చేస్తున్నారని తెలిపారు.
నాతవరం, గొలుగొండ ప్రాంతాల్లో గంజాయి అక్రమ రవాణా దారులపై గట్టి నిఘా ఉంచాలని, ఎటువంటి సిఫార్సులకు తావులేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
*వంగలపూడి అనిత హోంమంత్రి):*
"రాష్ట్రాన్ని గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చడమే మా సంకల్పం" అని హోంమంత్రి ప్రకటించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి కేసుల్లో పట్టుబడితే కఠిన శిక్షలు తప్పవని, దీనివల్ల భవిష్యత్తు నాశనం అవుతుందని హెచ్చరించారు. ప్రజలకు సత్వర సేవలు అందించడమే లక్ష్యంగా మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోందన్నారు.
*విశాఖ రేంజ్ ఐజీ మాట్లాడుతూ...* ఆధునిక భవనాల వల్ల సిబ్బంది పనితీరు మెరుగుపడుతుందని, ప్రజలకు వేగవంతమైన సేవలు అందుతాయని తెలిపారు.
*జిల్లా ఎస్పీ మాట్లాడుతూ* ఈ భవనాల ద్వారా పోలీసింగ్ మరింత ప్రజా కేంద్రితంగా మారుతుందని, ప్రజల విశ్వాసాన్ని పెంపొందించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నాతవరం ఎస్సీ కాలనీలో జరిగిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో స్పీకర్, హోంమంత్రి మరియు ఇతర అధికారులు పాల్గొని, ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమణ, అదనపు ఎస్పీ ఎల్.మోహన రావు, అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ ఎం.శ్రావణి, నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు, రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ, ఎస్సైలు తారకేశ్వరరావు (నాతవరం), రిషికేశ్ రావు (కృష్ణదేవిపేట), రామారావు (గొలుగొండ), స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

