గేట్–2026లో ఆల్ ఇండియా 13వ ర్యాంక్ సాధించిన మార్కాపురం కుర్రాడు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా ప్రతిభకు గ్రామీణ ప్రాంతం అడ్డంకి కాదని మరోసారి నిరూపిస్తూ మార్కాపురం పట్టణానికి చెందిన యువకుడు ఇమ్మడి ఫణీంద్ర కుమార్ గేట్–2026 పరీక్షలో ఆల్ ఇండియా స్థాయిలో 13వ ర్యాంక్ సాధించి విశేష ప్రతిభ కనబరిచాడు. ఈ అరుదైన విజయంతో కుటుంబ సభ్యులతో పాటు పట్టణ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ కుటుంబంలో జన్మించిన ఫణీంద్ర కుమార్ తండ్రి ఇమ్మడి రామ సుబ్బారావు గొట్టిపడియలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నారు.
తల్లి గృహిణిగా ఉంటూ చిన్ననాటి నుంచే చదువుపై ఆసక్తి పెంపొందించారు.
విద్యలో ప్రతి దశలోనూ మెరుగైన ఫలితాలు సాధిస్తూ ముందుకు సాగిన ఫణీంద్ర ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీలో మెటలర్జికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన అనంతరం జెఎస్డబ్ల్యూ సంస్థలో ఉద్యోగం చేపట్టిన ఆయన, ఉన్నత లక్ష్యాల సాధన కోసం ఆ ఉద్యోగాన్ని వదిలి గేట్ పరీక్షకు సిద్ధమయ్యారు. క్రమశిక్షణతో చదువుతూ, ప్రతిరోజూ సమయపాలన పాటిస్తూ, గత ప్రశ్నపత్రాలను విశ్లేషిస్తూ బలహీన అంశాలను మెరుగుపరుచుకుని ఈ ఘన విజయం సాధించారు.
ఈ సందర్భంగా ఫణీంద్ర కుమార్ మాట్లాడుతూ, నిరంతర శ్రమ, సరైన ప్రణాళిక ఉంటే ఎవరైనా పెద్ద లక్ష్యాలను సాధించగలరు” అని తెలిపారు. తన విజయానికి తల్లిదండ్రులు, గురువుల ప్రోత్సాహమే ప్రధాన కారణమని పేర్కొన్నారు.
