అనకాపల్లి జిల్లాలో ‘ఆపరేషన్ వజ్రప్రహార్.
డ్రోన్ కెమెరాలతో మెరుపు దాడులు.మత్తు పదార్థాల నిర్మూలనపై పోలీసుల ఉక్కుపాదం.
క్రైమ్9మీడియా జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.
అనకాపల్లి (పరవాడ)మార్చి:07 అనకాపల్లి జిల్లాను శాంతి భద్రతలకు నిలయంగా మార్చడమే కాకుండా, మత్తు పదార్థాల రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా,కఠిన చర్యలు చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా “ఆపరేషన్ వజ్ర ప్రహార్” పేరుతో పోలీసులు శనివారం తెల్లవారుజామున భారీ కార్డన్ అండ్ సెర్చ్ (CASO) నిర్వహించారు.
పరవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని జె.ఎన్.ఎన్.యు.ఆర్.ఎం (JNNURM) కాలనీ మరియు గొర్లెవానిపాలెం ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరిగాయి. నేరగాళ్ల కదలికలను కనిపెట్టేందుకు మరియు మారుమూల ప్రాంతాలను జల్లెడ పట్టేందుకు పోలీసులు ఈసారి అధునాతన డ్రోన్ కెమెరాలను ఉపయోగించారు. ఖాళీ భవనాలు, నిర్మానుష్య ప్రదేశాలను డ్రోన్ల ద్వారా క్షుణ్ణంగా వీడియో రికార్డింగ్ చేస్తూ తనిఖీలు చేపట్టారు.
గతంలో గంజాయి కేసుల్లో పట్టుబడిన ఒక పాత నేరస్థుడిని (Ex-Ganja Offender) గుర్తించి, ప్రస్తుతం అతని కదలికలపై విచారణ చేపట్టారు
ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిల్వ ఉంచిన 6 కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను, అలాగే 6 నైట్రోజన్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.
సరైన పత్రాలు లేని 10 మోటార్ సైకిళ్లు, 2 కార్లను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.
ఈ ఆపరేషన్ అనంతరం పోలీస్ అధికారులు స్థానిక ప్రజలతో సమావేశమై మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు.మత్తు పదార్థాల వినియోగం కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుంది. మా గ్రామాన్ని, మా కాలాన్ని గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల రహితంగా ఉంచుతాము. యువత భవిష్యత్తును నాశనం చేసే ఇటువంటి అక్రమ వ్యాపారాలకు వ్యతిరేకంగా పోలీసులకు సహకరిస్తాము" అని ప్రజలందరితో సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమం స్థానికుల్లో మంచి చైతన్యాన్ని నింపింది.
ఈ ఆపరేషన్ పరవాడ ఇన్ఛార్జ్ డీఎస్పీ బి.మోహనరావు ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగింది. ఈ తనిఖీల్లో పరవాడ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావు, రాంబిల్లి ఇన్స్పెక్టర్ నర్సింగరావు, ఎన్.డి.పి.ఎస్ (NDPS) సెల్ ఇన్స్పెక్టర్ రమేష్, ఎస్సైలు సింహాచలం, రామకృష్ణ, ప్రసాద్లతో పాటు సబ్-డివిజనల్ సిబ్బంది, ఏఆర్ టీమ్, ఈగల్ టీమ్ మరియు డాగ్ స్క్వాడ్ పాల్గొన్నారు. రెవెన్యూ అధికారుల (VROs) సమక్షంలో పూర్తి వీడియో గ్రఫీతో ఈ కార్యక్రమం పారదర్శకంగా నిర్వహించబడింది.
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని, ప్రజల భద్రత దృష్ట్యా ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీస్ అధికారులు హెచ్చరించారు.

