ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి.
హాజరు శాతం పెంచేందుకే ఉచిత సైకిళ్ల పంపిణి.
ముప్పవరం పీఎస్ఎన్ సీసీ విద్యార్థులకు ఉచితంగా 110 సైకిళ్ల పంపిణీ.
అద్దంకిలో ఇప్పటి వరకు 5,100 విద్యార్థిని విద్యార్థులకు సైకిళ్ల అందజేత ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్.
బాపట్ల జిల్లా అద్దంకి ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు.
అద్దంకి నియోజకవర్గంలోని జే.పంగలూరు మండలం, ముప్పవరం గ్రామంలోని పీఎస్ఎన్సీసీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 110 మంది విద్యార్థులకు ఇటలీకి చెందిన ఐ.ఎస్.పీ, ఆసిస్ట్ అనే స్వచ్ఛంద సంస్థల సహకారంతో మంగళవారం నాడు మంత్రి గొట్టిపాటి ఉచితంగా సైకిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యాశాఖ మంత్రి లోకేష్ తీసుకొచ్చిన సంస్కరణలతో ఆంధ్రప్రదేశ్ విద్యా విధానం అభివృద్ధి పథంలో దూసుకు పోతుందన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో, రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా 16,300కు పైగా టీచర్ పోస్టులను డిఎస్సీ ద్వారా కూటమి ప్రభుత్వం భర్తీ చేసిందన్నారు. పాఠశాలకు దూరం కాకుండా, తరగతులకు గైర్హాజరు కాకుండా ఉండేందుకు, డ్రాపౌట్ల సంఖ్య తగ్గించేందుకు సీఎస్ఆర్ నిధుల సహాయంతో ఉన్నత పాఠశాల విద్యార్థులకు సైకిళ్లను ఉచితంగా అందిస్తున్నామని ఆయన చెప్పారు.
అద్దంకి నియోజకవర్గ పరిధిలోని వివిధ ఉన్నత పాఠశాలలకు చెందిన సుమారు 5,100 మందికి పైగా విద్యార్థులకు ఇప్పటి వరకు సైకిళ్లను ఉచితంగా అందించామని మంత్రి గొట్టిపాటి వెల్లడించారు. ఇందులో అద్దంకి జూనియర్ కళాశాల విద్యార్థుల కూడా ఉన్నారని గుర్తు చేశారు. పారిశ్రామిక, వ్యాపార వర్గాలు, దాతలు, సీఎస్ఆర్ నిధుల సహకారంతో ఇటువంటి మహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థులందరూ ఇటువంటి అవకాశాలను వినియోగించుకుని చక్కగా చదువుకుని ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆయన ఆకాంక్షించారు. సైకిళ్ల పంపిణీ తరువాత పాఠశాలల్లో హాజరు శాతం పెరుగుతుందని మంత్రి గొట్టిపాటి ఆశాభావం వ్యక్తం చేశారు. అదే విధంగా జాతీయ రహదారులపై సైకిళ్లతో ప్రయాణించేప్పుడు అప్రమత్తంగా ఉండాలంటూ విద్యార్థులకు మంత్రి సూచించారు. ప్రమాదాలు జరగకుండా, రోడ్డుకు పక్కగా వెళ్లేలా విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలంటూ ఉపాధ్యాయులను ఆదేశించారు. సైకిల్ ప్రయాణాలపై తల్లిదండ్రులు కూడా విద్యార్థులకు తగు జాగ్రత్తలు చెప్పాలంటూ మంత్రి గొట్టిపాటి కోరారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థల నిర్వహకులు, స్థానిక నేతలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
రూ.85 లక్షలతో ఉప్పలపాడు అనుసంధాన రహదారి.
పల్నాడు జిల్లా, నరసరావుపేట: నియోజకవర్గంలోని ఉప్పలపాడు గ్రామ సమీపంలో నరసరావుపేట–వినుకొండ ఆర్ & బి రోడ్డుకు అనుసంధానంగా యన్.టి.ఆర్ కాలనీ వరకు నూతనంగా నిర్మించనున్న తారు రోడ్డుకు పల్నాడు ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు, ఎంపీ కృష్ణదేవరాయలుతో కలిపి శంకుస్థాపన చేశారు. సుమారు రూ.85 లక్షల MGNREGS నిధుల ద్వారా ఈ రహదారి నిర్మాణం చేపట్టనున్నారు.


