ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం, జిల్లా లో ఎల్ నినో వాతావరణ పరిస్థితులు, వర్షాభావం కారణంగా బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు అసాధారణంగా పెరిగిన నేపథ్యంలో, సామాన్య ప్రజలు మరియు రేషన్ కార్డుదారులపై ఆర్థిక భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత తెలిపారు.
సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మరియు రైస్ మిల్లర్ల అసోసియేషన్ భాగస్వామ్యంతో ప్రభుత్వం ప్రత్యేక అవుట్లెట్ స్టోర్ల ద్వారా తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా మార్కాపురం ఎస్టేట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సబ్సిడీ బియ్యం విక్రయ కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు తో కలిసి కలెక్టర్ ప్రారంభించి, లబ్ధిదారులకు 10 కేజీల బియ్యం ప్యాకెట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మీడియాతో జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత మాట్లాడుతూ...
రైస్ మిల్లర్ల సహకారం:
పెరుగుతున్న మార్కెట్ ధరలను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని, రైస్ మిల్లర్లతో మాట్లాడి సబ్సిడీ ధరకు బియ్యం అందజేసే సదుపాయం కల్పించిందని, ఈ చొరవకు సహకరించిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
భారీగా తగ్గింపు ధరలు:
ఈ కేంద్రాల ద్వారా బహిరంగ మార్కెట్లో కిలో రూ. 58/-లు ఉన్న బిపిటి బియ్యాన్ని కేవలం రూ. 50/-లకే (కిలోపై రూ. 8 సబ్సిడీ తగ్గింపుతో), అలాగే రూ. 62/-లు ఉన్న బిపిటి స్టీమ్ బియ్యాన్ని రూ. 52/-లకే (కిలోపై రూ. 10 సబ్సిడీ తగ్గింపుతో) నాణ్యమైన క్వాలిటీ బియ్యాన్ని ప్రజలకు అందజేస్తున్నట్లు వెల్లడించారు.
కార్డుదారులకు పిలుపు:
రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబం తమ ఆధార్ కార్డు లేదా హౌస్హోల్డ్ కార్డును చూపి ఈ ప్రత్యేక విక్రయ కేంద్రాల ద్వారా తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని పొంది, ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, పౌర సరఫరా అధికారులు, రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
