అక్కుపల్లిలో మార్మోగిన 'గాన కోకిల' స్వరాలు!
ఘనంగా ఎస్. జానకమ్మ 'స్వర నివాళి' కార్యక్రమము.
క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రతినిధి శంకర్ తమ్మినాన.
వజ్రపుకొత్తూరు జూలై 29: భారతీయ చలనచిత్ర సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్న 'గాన కోకిల' ఎస్. జానకమ్మకు అక్కుపల్లిలో ఘనంగా నీరాజనాలు అర్పించారు. ఉద్దాన కళాకారులు శంకర్, నరేష్, సిస్టుమనోజ్ ఆధ్వర్యంలో స్థానిక ఉద్దానం కళాకారులచే స్థానిక శ్రీ రామా సేవా సంఘ భవనంలో ఏర్పాటు చేసిన 'స్వర నివాళి' కార్యక్రమం కన్నుల పండువగా, శ్రోతలకు వీనుల విందుగా సాగింది. ఉద్దాన ప్రాంతానికి చెందిన ప్రతిభావంతులైన కళాకారులు జానకమ్మ పాడిన ఆణిముత్యాల్లాంటి పాటలను ఆలపించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.
కార్యక్రమం ప్రారంభంలో వేదికపై ఏర్పాటు చేసిన జానకమ్మ చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి భక్తిశ్రద్ధలతో అంజలి ఘటించారు. గాయనీ గాయకులు, శ్రీ రామా సేవా సంఘం ప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు ఈ కార్యక్రమంలో విశేషంగా పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం ప్రారంభమైన సంగీత విభావరిలో కళాకారులు తమ అద్భుతమైన గాత్రంతో జానకమ్మ పాటలకు ప్రాణం పోశారు. వేదికంతా మధురమైన పాటలతో మార్మోగిపోగా, ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో కళాకారులను ఉత్సాహపరిచారు.
"ఆరు దశాబ్దాల పాటు సంగీత ప్రపంచాన్ని ఏలిన మహారాణి జానకమ్మ. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు సుమారు 17 భాషల్లో 48 వేలకు పైగా పాటలు పాడిన అరుదైన చరిత్ర ఆమె సొంతం. నాలుగు జాతీయ అవార్డులు, 33 రాష్ట్ర స్థాయి పురస్కారాలు ఆమె గాత్ర మాధుర్యానికి దక్కిన గుర్తింపులు. వయసుతో సంబంధం లేకుండా పసిపాప నుంచి పండు ముసలి వరకు, ఏ పాత్రకైనా సరిపోయేలా తన గొంతును మార్చి పాడటం కేవలం జానకమ్మకే చెల్లింది. ఎలాంటి ఎలక్ట్రానిక్ సాంకేతికత లేని ఆ రోజుల్లోనే తన స్వరంతో మ్యాజిక్ చేసిన గొప్ప గాయని జానకమ్మ అని,జానకమ్మ పాటలు ఉన్నంత కాలం ఆమె మన మధ్యే చిరంజీవిగా ఉంటారని వక్తలు పేర్కొన్నారు. ఉద్దాన కళాకారుల ప్రతిభ, అద్భుతమైన గాత్రధారణ అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సంగీతాభిమానుల హర్షధ్వానాల మధ్య ఈ 'స్వర నివాళి' కార్యక్రమం అక్కుపల్లిలో ఒక మధుర స్మృతిగా నిలిచిపోయింది. సుమారు నాలుగు గంటల పాటు సాగిన ఈ స్వర నివాళి కార్యక్రమానికి సౌండింగ్ మరియు లైటింగ్స్ ను శ్రీ రామా సేవా సంఘం ఏర్పాటు చేయడమైనది . ఈ కార్యక్రమంలో ఉద్దాన సంగీత కళాకారులు మడ్డు శంకర్ , శిస్టు రామ్ మనోజ్ కుమార్ , జోగి పున్నయ్య , కాస గీత , కోడ నాగమణి , గుంటూ జ్యోతి, మడ్డు ఉషారాణి , జోగి విమల , మడ్డు లక్ష్మి, కోనేరు పద్మావతి ,
శ్రీ రామా సేవా సంఘం సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
