ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజాదర్బార్.. 34 వినతుల స్వీకరణ.
క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రత్యేక ప్రతినిధి శంకర్ తమ్మినాన.
పలాస: స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా పరిష్కార వేదిక–ప్రజాదర్బార్ కార్యక్రమానికి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
పింఛన్లు, రేషన్ కార్డులు, గృహ నిర్మాణాలు, తాగునీటి సౌకర్యం, గ్రామీణ రహదారులు, విద్యుత్ సమస్యలు, జంగిల్ క్లియరెన్స్ రోడ్లు తదితర అంశాలకు సంబంధించి మొత్తం 34 వినతిపత్రాలు ఎమ్మెల్యేకు సమర్పించారు.
ప్రజలు సమర్పించిన ప్రతి వినతిని ఎమ్మెల్యే పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి అర్హమైన సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో జాప్యం, నిర్లక్ష్యానికి తావులేకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజాదర్బార్ ద్వారా వచ్చిన వినతులను ప్రాధాన్యత ఆధారంగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

