పలాస పాఠశాలల్లో డైట్ బృందం ఆకస్మిక తనిఖీలు.
విద్యా ప్రమాణాలపై సంతృప్తి.. మరింత నాణ్యమైన బోధనకు సూచనలు.
క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా అధికార ప్రతినిధి శంకర్ తమ్మినాన.
పలాస, జూలై 3: జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు డైట్ అధ్యాపక బృందం శుక్రవారం పలాస మండలంలోని పలు ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. అకాడమిక్, పరిపాలన, మధ్యాహ్న భోజన పథకం అమలు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించింది.
చిన్నబాదం, ఉదయపురం, పలాస-కాశీబుగ్గ, గరుడకండి, పీఎన్ఆర్ కాలనీ, అంబుసోలి ఆదర్శ ప్రాథమిక పాఠశాలలతో పాటు పెంట, చిన్నబాదం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, ఉపాధ్యాయుల బోధనా విధానాలు, విద్యా ప్రమాణాలు, విద్యార్థులు-ఉపాధ్యాయుల హాజరు, ప్రభుత్వ మార్గదర్శకాల అమలు, మధ్యాహ్న భోజన పథకం నిర్వహణను పరిశీలించారు.
తరగతి గదులను సందర్శించిన డైట్ బృందం విద్యార్థుల అభ్యసన స్థాయిని పరీక్షించడంతో పాటు నోటు పుస్తకాలు, రికార్డులు, వార్షిక ప్రణాళికలు, పాఠ్యాంశాల పురోగతి, టీచింగ్-లెర్నింగ్ మెటీరియల్ వినియోగం, విద్యార్థుల క్రమశిక్షణను పరిశీలించింది. అలాగే పాఠశాలల పరిశుభ్రత, తాగునీటి సదుపాయం, మరుగుదొడ్ల నిర్వహణ, ఆవరణ పరిశుభ్రత, మొక్కల సంరక్షణ, మౌలిక వసతులను తనిఖీ చేసింది.
పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు సంతృప్తికరంగా ఉన్నాయని, ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తున్నారని డైట్ బృందం అభినందించింది. ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేసేందుకు ఇదే కృషిని కొనసాగించాలని ఉపాధ్యాయులకు సూచించింది. తనిఖీల్లో గుర్తించిన అంశాలపై మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు, సత్యనారాయణతో చర్చించారు.
ఈ తనిఖీల్లో డైట్ అధ్యాపకులు ఎ. వేణుగోపాల్, జి. ఇందువదన, ఎస్. మురళి, కె. రాజీవ్కుమార్, ఎస్. రమణ తదితరులు పాల్గొన్నారు.

