బూత్ లెవెల్ ఏజెంట్లే పార్టీ విజయానికి పునాదులు – మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.
పలాస నియోజకవర్గంలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంలో బూత్ లెవెల్ ఏజెంట్ల పాత్ర అత్యంత కీలకమని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. కాశీబుగ్గలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పలాస, మందస, వజ్రపుకొత్తూరు మండలాలు మరియు పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీకి చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నికల వ్యవస్థలో చోటు చేసుకుంటున్న మార్పులు, ప్రత్యేకించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై బూత్ స్థాయి నాయకులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఓటర్ల జాబితాల పరిశీలన, సవరణల ప్రక్రియలో అప్రమత్తంగా వ్యవహరించి ప్రతి ఓటును పరిరక్షించాల్సిన బాధ్యత బీఎల్ఏలపై ఉందన్నారు.
ఎన్నికల నిబంధనలు, విధానాలపై పూర్తి అవగాహన కల్పించేందుకు పార్టీ సీనియర్ నాయకులు, ఎన్నికల నిపుణులతో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి హాజరైన జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్సీ కుంభ రవిబాబు, డిజిటల్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ అందించిన ధనంజయతో పాటు నాయకులు, కార్యకర్తలకు స్వాగతం పలికారు.
కార్యకర్తలే పార్టీకి అసలైన బలం – ధర్మాన కృష్ణదాస్.
జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ, డాక్టర్ సీదిరి అప్పలరాజు ప్రజల ఆదరణ పొందిన నాయకుడని, పలాస ప్రాంత అభివృద్ధికి ఆయన చేసిన సేవలు విశేషమని అన్నారు. భవిష్యత్తులో పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త, ప్రతి బూత్ ఏజెంట్ అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
గత ఎన్నికల్లో జరిగిన లోపాల నుంచి పాఠాలు నేర్చుకుని ఇకపై ప్రతి బూత్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఓటర్ల జాబితా సవరణ సమయంలో ఎలాంటి అర్హులైన ఓటర్లు తొలగించబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ఎన్నికల వ్యవస్థపై పూర్తి అవగాహన అవసరం – ఎమ్మెల్సీ కుంభ రవిబాబు.
ఎమ్మెల్సీ కుంభ రవిబాబు మాట్లాడుతూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ఓటర్ల జాబితాల ఖచ్చితత్వానికి దోహదపడుతుందని తెలిపారు. బూత్ స్థాయి నాయకులు ఈ ప్రక్రియను సద్వినియోగం చేసుకుని ఎన్నికల విధానాలపై సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.
పార్టీ కార్యకర్తలకు, బూత్ స్థాయి నాయకత్వానికి ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సంస్థాగత వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు.


