క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.
వజ్రపుకొత్తూరు, జూన్ 13: రైతుల అభివృద్ధికి ఆధునిక వ్యవసాయ యంత్రాలు ఎంతో దోహదపడతాయని, వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా రైతులకు సాగు ఖర్చులు తగ్గి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందని పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష తెలిపారు.
వజ్రపుకొత్తూరు మండలంలోని ఎఫ్పీఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ సాగు యంత్రాల బ్యాంకు "కస్టమ్ హైరింగ్ సెంటర్" ను ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్న, సన్నకారు రైతులు ఖరీదైన వ్యవసాయ యంత్రాలను కొనుగోలు చేయడం కష్టతరమైన పరిస్థితుల్లో కస్టమ్ హైరింగ్ సెంటర్ల ద్వారా తక్కువ అద్దెకు అవసరమైన యంత్రాలను పొందవచ్చని తెలిపారు. దీనివల్ల వ్యవసాయ పనులు వేగంగా పూర్తవడంతో పాటు కూలీల కొరత సమస్యను కూడా అధిగమించవచ్చని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం వ్యవసాయ యాంత్రీకరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా ఇటువంటి కార్యక్రమాలు కీలకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. రైతులు అందుబాటులో ఉన్న ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ఆధునిక సాగు పద్ధతులను అవలంబించాలని సూచించారు.
అనంతరం కస్టమ్ హైరింగ్ సెంటర్లో అందుబాటులో ఉన్న వివిధ వ్యవసాయ యంత్రాలను ఎమ్మెల్యే పరిశీలించి, వాటి పనితీరు మరియు వినియోగంపై వ్యవసాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు, ఎంపీడీఓ, వ్యవసాయ శాఖ అధికారులు, వెలుగు సిబ్బంది, ఎఫ్పీఓ ప్రతినిధులు, వజ్రపుకొత్తూరు మండల టీడీపీ అధ్యక్షులు, కార్యదర్శులు, ఇతర ముఖ్య నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు మరియు ప్రజలు పాల్గొన్నారు.


