జూదం ఆడుతున్న వారిపై పోలీసుల మెరుపు దాడి: 14 మంది అరెస్ట్, రూ.1,80,000 నగదు స్వాధీనం.
*క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.
అనకాపల్లి(ఏ.కోడూరు)జూన్:14 జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మరియు అనకాపల్లి సబ్ డివిజన్ అదనపు ఎస్పీ ఎం.శ్రావణి ఆదేశాల మేరకు, జిల్లాలో అసాంఘిక కార్యకలాపాల అణచివేతలో భాగంగా పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా కె.కోటపాడు సిఐ కృష్ణ పర్యవేక్షణలో, ఏ.కోడూరు ఎస్సై కె.సంతోష్ కుమార్ తమ సిబ్బందితో కలిసి శనివారం రాత్రి కొరువాడ గ్రామంలో మెరుపు దాడి నిర్వహించారు గ్రామంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న జూద స్థావరంపై దాడి చేసి, నిర్వాహకులతో పాటు మొత్తం 14 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ.1,80,000/- (ఒక లక్షా ఎనభై వేల రూపాయలు) నగదుతో పాటు జూదానికి ఉపయోగించిన ఇతర సామాగ్రిలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, జిల్లాలో చట్టవిరుద్ధమైన జూదం, పేకాట లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి అనైతిక పనుల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ఎక్కడైనా జూదం ఆడుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడుతాయని తెలిపారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
