జీడిపప్పు పరిశ్రమపై అసత్య ప్రచారాలను నమ్మొద్దు: పలాస ఏఎంసీ చైర్మన్ మళ్లా శ్రీను.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన .
పలాస, జూన్ 8:
పలాస జీడిపప్పు పరిశ్రమపై 1 శాతం మార్కెట్ ఫీజు (AMC Fee) విధింపు, ఆన్లైన్ వ్యాపార నమోదు విధానం తదితర అంశాలపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న అసత్య ప్రచారాలను పలాస వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) చైర్మన్ మళ్లా శ్రీను తీవ్రంగా ఖండించారు. పలాసలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జీడిపప్పు వ్యాపారులు, పరిశ్రమల యజమానులను తప్పుదోవ పట్టించేలా కొందరు వ్యక్తులు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
ముడి జీడిపిక్కలపై ఇప్పటికే పన్నులు చెల్లించిన నేపథ్యంలో, ప్రాసెస్ చేసిన జీడిపప్పుపై 1 శాతం సెస్ విధించడం ద్వంద్వ పన్ను (డబుల్ టాక్సేషన్) కాదని ఆయన స్పష్టం చేశారు. ఇది పన్ను కాదని, చట్టబద్ధమైన మార్కెట్ ఫీజు మాత్రమేనని వివరించారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెట్ల చట్టం-1966 ప్రకారం మార్కెట్ కమిటీలకు తమ పరిధిలో కొనుగోలు, విక్రయాలు జరిగే వ్యవసాయ ఉత్పత్తులపై మార్కెట్ ఫీజు వసూలు చేసే పూర్తి అధికారం ఉందన్నారు.
చట్టం ప్రకారం ముడి జీడిపిక్కలు (Raw Cashew Nuts) మరియు ప్రాసెస్ చేసిన జీడిపప్పు (Processed Cashew Kernels) రెండు వేర్వేరు వాణిజ్య ఉత్పత్తులుగా పరిగణించబడతాయని తెలిపారు. ఇతర రాష్ట్రాలు లేదా విదేశాల నుంచి దిగుమతి చేసిన ముడి జీడిపిక్కలపై స్థానికంగా మొదటి విక్రయం జరగకపోతే చట్ట ప్రకారం మినహాయింపులు వర్తిస్తాయని, అయితే ప్రాసెస్ చేసిన జీడిపప్పును పలాస నోటిఫైడ్ మార్కెట్ పరిధిలో విక్రయించినప్పుడు మార్కెట్ ఫీజు తప్పనిసరిగా వర్తిస్తుందని చెప్పారు.
ఆన్లైన్ ట్రేడర్ రిజిస్ట్రేషన్, డిజిటల్ పర్మిట్ విధానాలపై కూడా కొందరు అనవసర భయాందోళనలు సృష్టిస్తున్నారని విమర్శించారు. వ్యవసాయ మార్కెటింగ్ కమిషనర్ ఆదేశాల మేరకు అమలవుతున్న ఈ విధానం వ్యాపారుల సౌలభ్యం కోసం తీసుకొచ్చిందేనని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ మార్కెట్స్ చట్టం-1966 సెక్షన్ 7 ప్రకారం మార్కెట్ పరిధిలో వ్యాపారం చేసే ప్రతి వర్తకుడు లైసెన్స్ పొందడం తప్పనిసరి అని గుర్తుచేశారు.
ఆన్లైన్ విధానం ద్వారా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గుతుందని, దళారీల వ్యవస్థకు అడ్డుకట్ట పడుతుందని, అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా అనుమతులు పొందే అవకాశం కలుగుతుందని వివరించారు. ఇది వ్యాపారులపై భారం కాకుండా వారికి మేలు చేసే సంస్కరణ అని పేర్కొన్నారు.
ఇతర రాష్ట్రాల్లో మార్కెట్ సెస్ లేదని, కేవలం ఆంధ్రప్రదేశ్లోనే విధిస్తున్నారని జరుగుతున్న ప్రచారం వాస్తవాలకు విరుద్ధమని అన్నారు. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక వ్యవసాయ మార్కెటింగ్ చట్టాలు ఉంటాయని, ఏపీలో వసూలు చేసే 1 శాతం మార్కెట్ ఫీజు దేశంలోనే అత్యంత సహేతుకమైన రేట్లలో ఒకటని తెలిపారు. ఈ నిధులను మార్కెట్ యార్డుల అభివృద్ధి, రహదారులు, గిడ్డంగులు, మౌలిక సదుపాయాల కల్పన, రైతులకు సేవల మెరుగుదల కోసం వినియోగిస్తున్నామని చెప్పారు.
1 శాతం ఫీజు కారణంగా పరిశ్రమలు మూతపడతాయని, 25 వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోతారని ప్రచారం చేయడం పూర్తిగా నిరాధారమని ఆయన పేర్కొన్నారు. పలాస జీడిపప్పుకు దేశ, విదేశీ మార్కెట్లలో ప్రత్యేక గుర్తింపు ఉందని, పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. చట్టబద్ధమైన ఫీజుల చెల్లింపుతో మార్కెట్ వ్యవస్థ మరింత బలోపేతమై పరిశ్రమలకు చట్టపరమైన రక్షణ, గుర్తింపు పెరుగుతుందని చెప్పారు.
పలాస మార్కెట్ కమిటీ పరిధిలోని మందస, వజ్రపుకొత్తూరు, పలాస మండలాలు మరియు పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని జీడిపప్పు వ్యాపారులు, పరిశ్రమల యజమానులు రాజకీయ ప్రేరేపిత లేదా అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
జూలై 1, 2026 నుంచి అమలులోకి రానున్న ఆన్లైన్ నమోదు, డిజిటల్ పర్మిట్ విధానాలకు వ్యాపారులు సహకరించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ మార్కెట్స్ చట్టం-1966 నిబంధనలను ఉల్లంఘించే వారిపై, అలాగే తప్పుడు ప్రచారాలతో ప్రజలను, వ్యాపారులను తప్పుదోవ పట్టించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
