క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.
పలాస, జూన్ 11:
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఎమ్మెల్యే గౌతు శిరీష, కూటమి ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఏపీటీపీసీ చైర్మన్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి వజ్జ బాబురావు విమర్శించారు. పలాస అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని ఆయన మాజీ మంత్రికి సవాల్ విసిరారు.
గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో బాబురావు మాట్లాడుతూ గత ఐదేళ్ల పాలనలో పలాస అభివృద్ధి వెనుకబడిందని ఆరోపించారు. రైతులకు సాగునీరు, మౌలిక సదుపాయాల కల్పనలో గత ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయని తెలిపారు.
ఆర్వోబీ నిర్మాణ పనులు, ఆఫ్షోర్ ప్రాజెక్టు పనులు, కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష కృషితో పలాసకు పలు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు.
మందస, వజ్రపుకొత్తూరు మండలాలతో పాటు పలాస మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు తీసుకొచ్చి పనులు చేపడుతున్నామని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని మాజీ మంత్రి అప్పలరాజుకు సూచించారు.
కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటుందని వజ్జ బాబురావు అన్నారు.
