కలెక్టర్ ఆదేశాల మేరకు బంటు కొత్తూరులో ‘డ్రై డే ఫ్రైడే’ కార్యక్రమం.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.
పలాస, జూన్ 19:
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్న “డ్రై డే ఫ్రైడే” కార్యక్రమంలో భాగంగా పలాస మండలం బంటు కొత్తూరు గ్రామంలో శుక్రవారం ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు.
బంటు కొత్తూరు సచివాలయ పరిధిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు, ఆరోగ్య సిబ్బంది గ్రామంలోని పలు ఇళ్లను సందర్శించి పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, వాటర్ ట్యాంకులు, డ్రమ్లు, నీటి నిల్వ పాత్రలను తరచూ శుభ్రపరచాలని ప్రజలకు సూచించారు.
దోమల వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించిన అధికారులు, డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల నివారణకు ప్రతి శుక్రవారం ‘డ్రై డే’ పాటించడం ఎంతో అవసరమని తెలిపారు. నిల్వ నీటిని తొలగించడం ద్వారా వ్యాధులను గణనీయంగా తగ్గించవచ్చని వివరించారు
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, డిప్యూటీ ఎంపీడీవో, ఆశా వర్కర్లు, ఆరోగ్య శాఖ సిబ్బంది, సీవీఎపి యూనిట్ సభ్యులు, యంగ్ ప్రొఫెషనల్, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామ ప్రజలకు పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ స్వచ్ఛమైన పరిసరాల ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు.

