ఆపరేషన్ క్లీన్ స్వీప్తో పరిశుభ్రతపై చైతన్యం.
ప్రజలకు అవగాహన కల్పించిన ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జ బాబూరావు.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.
పలాస: మే 31
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమం పలాస పట్టణంలోని ఉదయపురం ప్రాంతంలో ఘనంగా నిర్వహించారు. “ఒక రాష్ట్రం – ఒక పరిశుభ్రత” అనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జ బాబూరావు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వజ్జ బాబూరావు మాట్లాడుతూ పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడు తన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన సామాజిక బాధ్యత ఉందన్నారు. శుభ్రమైన వాతావరణం ప్రజల ఆరోగ్యానికి ఎంతో అవసరమని, చెత్తను నిర్దేశిత ప్రాంతాల్లో మాత్రమే వేయాలని సూచించారు.
పలాస పట్టణాన్ని ఆదర్శవంతమైన పరిశుభ్ర పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రజల భాగస్వామ్యం కీలకమని ఆయన పేర్కొన్నారు. కాలువల్లో చెత్త వేయడం వల్ల నీటి నిల్వలు ఏర్పడి దోమలు, అంటువ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రతి కుటుంబం పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు.
మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు మాట్లాడుతూ పట్టణ అభివృద్ధిలో పారిశుద్ధ్యం కీలకమని తెలిపారు. చెత్త సేకరణ, కాలువల శుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ కోసం మున్సిపాలిటీ ప్రత్యేక చర్యలు చేపడుతోందని, ప్రజల సహకారంతో పరిశుభ్రమైన పలాస నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు.
కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రజలకు పరిశుభ్రత వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాలు, వీధులు, కాలువలు పరిశుభ్రంగా ఉంచడం ద్వారా అంటువ్యాధులను నివారించవచ్చని వివరించారు. యువత, మహిళలు, స్థానిక సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొని పరిశుభ్రత పట్ల తమ బాధ్యతను గుర్తుచేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు గాలి కృష్ణారావు, డొక్కరి శంకర్, కొవ్వూరు సురేష్, పురపాలక సంఘం సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ లక్ష్యం సాకారమవుతుందనే సందేశాన్ని “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమం మరోసారి చాటిచెప్పింది.

