త్రాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి కలెక్టర్.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ఒంగోలు,ప్రస్తుత వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలను వడగాల్పుల పట్ల అప్రమత్తం చేయడంతో పాటు ప్రజలు ఎండ తీవ్రతకు గురికాకుండా చేపట్టవలసిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులు కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో ప్రస్తుత వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ఎండ తీవ్రతపై తీసుకోవలసిన ముందు జాగ్రత్త చర్యలు, ప్రజలను అప్రమత్తం చేయడం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ రాజాబాబు, జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి తో కలసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ రాజాబాబు మాట్లాడుతూ, రానున్న 15 రోజుల్లో అధిక ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉన్నందున, ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల మధ్య సమయంలో అత్యవసరమైతే తప్ప ఎండలో ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్దులు,దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు బయట తిరగడం వాయిదా వేసుకోవాలన్నారు. ఎండ తీవ్రతకు గురికాకుండా తీసుకోవలసిన చర్యలపై ప్రజలకు అవగాహన కలిగించాలని, అలాగే ప్రధాన కూడళ్ళు, బస్టాండ్, రైల్వే స్టేషన్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో చలివేంద్రాలు ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వడదెబ్బ తగిలిన వారికి తక్షణమే చికిత్స అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రత్యేక వార్డులు ఏర్పాటుచేయాలని, ప్రభుత్వ ఆసుపత్రులన్నింటిలోనూ అవసరమైన మేర ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధం చేయాలన్నారు. వేడి గాలులు వీసే సమయంలో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు నుండి వెళ్లే సమయంలో బయట తిరగకుండా పిల్లలు నేరుగా ఇంటికి వెళ్లేలా చూడాలన్నారు.
ఉపాధి హామీ కూలీలకు త్రాగునీరు, నీడలాగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్టీసీ బస్సు స్టాండ్లు, బస్సు షెల్టర్లలో త్రాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. వేసవిలో త్రాగునీటి ఎటువంటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వేసవిలో విద్యుత్ సరఫరాకు ఎటువంటి అంతరాయం లేకుండా చూడాలని ట్రాన్స్కో అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో పొలాల్లో పనిచేస్తున్న రైతులు, ప్రజలు చెట్ల కింద ఉండరాదన్న విషయాన్ని ప్రజల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
ఈ సమావేశంలో కందుకూరు సబ్ కలెక్టర్ హిమ వంశి, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

