భరణికోట ఆశ్రమ పాఠశాల విద్యార్థిని ఆత్మహత్యాయత్నంపై సమగ్ర విచారణ జరపాలి.
క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రత్యేక ప్రతినిధి శంకర్ తమ్మినాన.
బాధ్యులపై చర్యలు తీసుకుని, విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలి: పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. వినోద్ కుమార్
పలాస జూలై 16:
శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం భరణికోట ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సవర నవ్యశ్రీ అనే విద్యార్థిని పాఠశాల భవనం పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.
గురువారం పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినిని ఆయన పరామర్శించి, కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఉపాధ్యాయుల మందలింపుల కారణంగానే విద్యార్థిని ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, ఘటనపై నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ నిర్వహించాలని కోరారు.
విద్యార్థిని పూర్తి స్థాయిలో కోలుకునేలా ప్రభుత్వం మెరుగైన వైద్య చికిత్స అందించడంతో పాటు, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు తరచూ మానసిక ఆరోగ్య అవగాహన, కౌన్సెలింగ్ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
విద్యార్థులపై ఒత్తిడి, భయాందోళనలు తగ్గించేలా పాఠశాల యాజమాన్యాలు సానుకూల వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ఉందని ఎం. వినోద్ కుమార్ పేర్కొన్నారు.
