కార్యకర్తలే పార్టీకి వెన్నెముక – స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి: వజ్జ బాబూరావు.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.
పలాస, జూన్ 3: తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కార్యకర్తలే ప్రధాన బలమని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వజ్జ బాబూరావు పిలుపునిచ్చారు.
పలాస పురపాలక సంఘం పరిధిలోని క్లస్టర్-2, యూనిట్-7లో బుధవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. "కార్యకర్తే అధినేత – ప్రతి కార్యకర్త నాయకుడే" అనే సిద్ధాంతంతో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్ఠం చేస్తున్నట్లు తెలిపారు.
స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ప్రజలతో మమేకమై పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని అన్నారు. గ్రామాలు, వార్డులు, బూత్ స్థాయిల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తూ ప్రజా సమస్యలపై అవగాహన పెంపొందించాలని సూచించారు.
సమావేశంలో ఎన్నికల వ్యూహాలు, ఓటర్లతో అనుసంధానం, యువతను పార్టీలోకి ఆకర్షించడం, పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో విస్తరించడం వంటి అంశాలపై చర్చించారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తే స్థానిక ఎన్నికల్లో పార్టీకి ఘన విజయం సాధ్యమవుతుందని వజ్జ బాబూరావు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్చార్జి గాలి కృష్ణారావు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు బడ్డ నాగరాజు, కార్యదర్శి సప్ప నవీన్, ఏఎంసీ చైర్మన్ మల్లా శ్రీనివాసరావు, పట్టణ నాయకులు చిన్ని, కొవ్వూరు సురేష్, జోగ మల్లి, పట్ట మల్లేష్, కుమ్మరి శివాజీ, గురిటి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపుతూ పార్టీ బలోపేతం, ఎన్నికల సన్నద్ధత లక్ష్యంగా ఈ సమావేశం విజయవంతంగా నిర్వహించబడిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

