మున్సిపల్ సేవల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికుల నిరసన.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.
పలాస, జూన్ 22: మున్సిపాలిటీల్లో సేవలను పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్) విధానంలో ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెం. 975, 673లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పలాస-కాశీబుగ్గ మున్సిపల్ కార్మికులు సోమవారం కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద నిరసన ధర్నా నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సామూహిక ఆందోళనలకు మద్దతుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్. గణపతి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కె. వెంకటి, బి. కుర్మారావు మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో శాశ్వత స్వభావం గల పనులను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం వల్ల కార్మికులు ఉద్యోగ భద్రత కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
సుప్రీంకోర్టు 2016 తీర్పు మేరకు “సమాన పనికి సమాన వేతనం” అమలు చేయాలని, హైకోర్టు ఆదేశాల ప్రకారం మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.
అలాగే 2011-12 సంవత్సరాలకు సంబంధించిన 20 నెలల పీఎఫ్ బకాయిలను కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని, 2024లో చేపట్టిన ఏడు రోజుల సమ్మె కాలానికి సంబంధించిన వేతనాలను చెల్లించాలని కోరారు. పదవీ విరమణ చేసిన లేదా మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో కె. ఈశ్వరరావు, అమర్, రజేష్, రాము, రవి, బాలరాజు, ప్రకాష్ ముఖి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

