క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.
పలాస, జూన్ 5:
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పలాస నియోజకవర్గంలో గురువారం పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలకు పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను వివరించారు.
పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం కల్పించే లక్ష్యంతో ఎమ్మెల్యే తన కార్యాలయం నుంచి భారీ బైక్ ర్యాలీకి శ్రీకారం చుట్టారు. యువత, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ ర్యాలీ పట్టణ ప్రధాన వీధుల గుండా సాగి ఆకట్టుకుంది. ర్యాలీ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన నినాదాలు హోరెత్తాయి.
అనంతరం ముత్యాలమ్మ కోనేరు వద్ద మొక్కల నాటే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గౌతు శిరీష, మొక్కలు మన జీవనాధారమని పేర్కొన్నారు. ప్రకృతి సమతుల్యతను కాపాడడంలో చెట్ల పాత్ర ఎంతో కీలకమని, ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పర్యావరణాన్ని రక్షించడం కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతగా భావించాలని అన్నారు. పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించాలంటే మొక్కల పెంపకాన్ని ఉద్యమంగా మార్చాల్సిన అవసరం ఉందని తెలిపారు.
“మన ఇంటి పరిసరాలు, ఖాళీ స్థలాలు, విద్యాసంస్థలు, కార్యాలయ ప్రాంగణాల్లో విస్తృతంగా మొక్కలు నాటాలి. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలి. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, పచ్చని ప్రకృతి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడం మనందరి కర్తవ్యం” అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, పర్యావరణ ప్రేమికులు మరియు పలువురు ప్రజలు పాల్గొన్నారు.

