నవచేతన కార్యక్రమంతో చిన్నారుల అభివృద్ధి అంచనా.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా శారీరక, మానసిక స్థాయిల పరిశీలన.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.
మార్కాపురం జిల్లా కంభం కేంద్రం లో నవచేతన కార్యక్రమంలో భాగంగా గురువారం స్థానిక అర్బన్ కాలనీ కందులాపురం రైల్వే 2 అంగన్వాడీ కేంద్రంలో చిన్నారుల క్రియాశీలక అభివృద్ధి అంశాలను సీడీపీఓ కుమారి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీడీపీఓ కుమారి ఆధ్వర్యంలో చిన్నారుల శారీరక, మానసిక అభివృద్ధి స్థాయిలను సమగ్రంగా అంచనా వేశారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా చిన్నారుల అభివృద్ధి దశలను పరిశీలించి, వారి ఆరోగ్య స్థితిగతులను నమోదు చేశారు.
కార్యక్రమంలో చిన్నారులకు వివిధ రకాల ఆటలు, పాటలు, రంగులను గుర్తించే కార్యక్రమాలను నిర్వహించి, వినూత్న క్రియల ద్వారా చిన్నారుల జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం, ఏకాగ్రత, భాషా నైపుణ్యాలు, సామాజిక ప్రవర్తన తదితర అంశాలను అంచనా వేశారు. పిల్లల శారీరక ఎదుగుదల, కదలికల సామర్థ్యం, స్పందన తీరు వంటి అంశాలపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా సీడీపీఓ కుమారి మాట్లాడుతూ, చిన్నారుల ఎదుగుదలలో ప్రారంభ దశ ఎంతో కీలకమని, ఈ సమయంలో వారి అభివృద్ధిని క్రమం తప్పకుండా పరిశీలించడం ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను ముందుగానే గుర్తించి తగిన చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. నవచేతన కార్యక్రమం ద్వారా చిన్నారుల అభివృద్ధి స్థాయిని గుర్తించి వారికి అవసరమైన సహకారం అందించే అవకాశం ఉంటుందన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులకు, చిన్నారుల పోషణ, ఆరోగ్య సంరక్షణ, విద్యా ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. పిల్లలతో ఎక్కువ సమయం గడపడం, వారి అభిరుచులను ప్రోత్సహించడం, ఆరోగ్యకరమైన పౌష్టికాహారాన్ని అందించడం వంటి సూచనలు చేశారు. చిన్నారుల అభివృద్ధిని ఆధునిక సాంకేతికతతో అంచనా వేయడం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. నవచేతన కార్యక్రమం చిన్నారుల సమగ్ర అభివృద్ధికి దోహదపడే మంచి వేదికగా నిలుస్తోందని వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు
ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ గాలమ్మ, అంగన్వాడీ కార్యకర్త శ్రీదేవి, చిన్నారులు, తల్లిదండ్రులు మరియు స్థానికులు పాల్గొన్నారు

