లబ్ధిదారులకు రుణాలను సత్వరమే మంజూరు చేయాలి కలెక్టర్.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.
ప్రకాశం జిల్లా ఒంగోలు అభివృద్ధి, ప్రభుత్వ లక్ష్యాల సాధనకు అనుగుణంగా రుణాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు బ్యాంకర్లకు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన అధ్యక్షతన ప్రకాశం భవనములో జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమీక్ష సమావేశం జరిగింది. వివిధ పథకాలకు, స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల ద్వారా మంజూరైన రుణాల వివరాలను ఎల్.డీ.ఎం. రమేష్ ఈ సందర్భంగా కలెక్టరుకు వివరించారు.
దీనిపై కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త ఎదగాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ దిశగా, ముఖ్యంగా స్వయం సహాయక సంఘాలకు విరివిగా రుణాలు ఇవ్వాలని ఆయన సూచించారు. డిఆర్డిఏ, మెప్మా
ద్వారా బ్యాంకు లింకేజీ రుణాలలో ఘనమైన
పురోగతి సాధించడంపై కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రూపొందించిన ' స్వయం' యాప్ ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలు తయారుచేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలను పెంచడంపై దృష్టి సారించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
విశ్వకర్మ పథకంలో కూడా లబ్ధిదారులకు రుణాలను సత్వరమే మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆర్థిక సమ్మిళితం, తలసరి ఆదాయం పెంపు వంటి
ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో రుణాలు మంజూరు చేయటంలో సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ బ్యాంకర్లు సమిష్టిగా పనిచేయాలని కలెక్టర్ సూచించారు.
పలువురు లబ్ధిదారులకు రుణాల మంజూరు పత్రాలను ఈ కార్యక్రమంలో కలెక్టర్ అందించారు. డిజిటల్ ఫైనాన్షియల్ లిటరసీ పోస్టర్లను కూడా ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో ఆర్.బి.ఐ. నుంచి ఎల్.డి.వో. రోహిత్ అగర్వాల్, నాబార్డ్ డీడీఎం రవికుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.
