మొగిలిపాడు పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.
పలాస, జూన్ 20:
పలాస మున్సిపాలిటీ పరిధిలోని మొగిలిపాడు ప్రాథమికోన్నత పాఠశాలను ఏపీటీపీసీ చైర్మన్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి శ్రీ వజ్జ బాబూరావు శనివారం ఆకస్మికంగా సందర్శించి పాఠశాల నిర్వహణ, విద్యా ప్రమాణాలు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు.
పాఠశాలలోని తరగతి గదులను సందర్శించిన ఆయన విద్యార్థులతో ముచ్చటిస్తూ వారి విద్యాభ్యాసం, ఉపాధ్యాయుల బోధన విధానం, పాఠశాలలో అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని జీవితంలో ముందుకు సాగాలని సూచించారు. విద్యతో పాటు నైతిక విలువలు, సామాజిక బాధ్యతలను అలవర్చుకోవాలని హితవు పలికారు.
అనంతరం పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన వజ్జ బాబూరావు, విద్యార్థులతో కలిసి భోజనశాలను సందర్శించి ఆహార నాణ్యత, పరిశుభ్రత, మెనూ అమలు తదితర అంశాలపై సిబ్బందిని ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు పోషకాహారంతో కూడిన నాణ్యమైన భోజనం అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు సూచించారు.
పాఠశాల ఆవరణలో తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, పారిశుధ్య నిర్వహణ, ఇతర మౌలిక వసతులను పరిశీలించిన ఆయన విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యారంగ అభివృద్ధికి అనేక సంస్కరణలు చేపడుతున్నట్లు తెలిపారు.
స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష ప్రత్యేక చొరవతో నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, మౌలిక వసతుల మెరుగుదలకు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
పాఠశాల అభివృద్ధికి అవసరమైన సమస్యలు, అవసరాలను స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని వజ్జ బాబూరావు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

