చంద్రబాబు కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనకు నిరసనగా జూన్ 5న ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమం.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.
పలాస-కాశీబుగ్గ, జూన్ 4:
రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జూన్ 5న ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పలాస-కాశీబుగ్గ పట్టణ అధ్యక్షుడు గోపీ శిష్టు తెలిపారు.
శుక్రవారం కాశీబుగ్గలోని శ్రీనివాస లాడ్జి జంక్షన్ వద్ద మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుందని ఆయన వెల్లడించారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని, హామాల అమలుపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలు, పాత్రికేయులు, ప్రజలపై అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు.
రాష్ట్ర అభివృద్ధి పేరుతో భారీ ఎత్తున అప్పులు చేస్తూ ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టివేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో అందడం లేదని, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు కొత్త పింఛన్లు మంజూరు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ సేవలు సక్రమంగా అందక పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
రైతులకు విత్తనాలు, ఎరువులు, గిట్టుబాటు ధరలు అందడం లేదని, పంట బీమా వ్యవస్థ సక్రమంగా అమలు కాక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు, ఇంధన ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్య ప్రజలపై అదనపు భారం పడిందని విమర్శించారు.
నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి కల్పిస్తామని ఇచ్చిన హామీలు అమలు కాలేదని, కార్మికులకు అనుకూలంగా ఉండాల్సిన విధానాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా సహజ వనరుల దోపిడీ, మద్యం సిండికేట్ల ప్రోత్సాహం వంటి అంశాల వల్ల ప్రజలు నష్టపోతున్నారని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని గోపీ శిష్టు పిలుపునిచ్చారు.
